-->

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం… నీటి కుంటలో ముగ్గురు చిన్నారులు మృతి


నాగర్ కర్నూలు జిల్లా, జనవరి 25: హైదరాబాద్ నుంచి నానమ్మను చూసేందుకు పల్లెకు వచ్చిన ముగ్గురు చిన్నారులు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది.

వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలకి చెందిన స్నేహ (15), ముచ్చర్లపల్లికి చెందిన సిరి (14), శ్రీమన్యు (14) కలిసి సెలవుల సందర్భంగా నానమ్మ ఇంటికి వచ్చారు. పొలాల వద్ద ఆడుకుంటున్న సమయంలో వారిలో ఒకరు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయారు.

ఆ చిన్నారిని కాపాడాలనే ఆతృతలో మిగిలిన ఇద్దరూ కుంటలోకి దిగగా, ఊబిలో చిక్కుకుని ముగ్గురూ నిమిషాల వ్యవధిలోనే ఊపిరాడక మృతి చెందారు. సహాయం కోసం కేకలు వేయడానికి కూడా అవకాశం లేకపోయిందని స్థానికులు తెలిపారు.

నీటిపై తేలుతున్న చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు కావడంతో విషాదం మరింత తీవ్రంగా మారింది. సెలవులు ముగిశాక మళ్లీ చదువుల కోసం నగరానికి వెళ్లాల్సిన పిల్లలు ఇలా అనంతలోకాలకు వెళ్లిపోవడం గ్రామస్తులను కలచివేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పొలాల వద్ద ఉన్న నీటి కుంటలు, బోరుబావుల విషయంలో తల్లిదండ్రులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. చిన్నారులను ప్రమాదకర ప్రదేశాలకు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793