రూ.547 కోట్ల సైబర్ మోసానికి చెక్ ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్ కల్యాణ్ అరెస్ట్
హైదరాబాద్: రూ.547 కోట్ల భారీ సైబర్ మోసానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్ కల్యాణ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో, అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో కలిసి దేశవ్యాప్తంగా వందలాది మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. వివిధ డిజిటల్ మాధ్యమాల ద్వారా నకిలీ పెట్టుబడి పథకాలు, ఆన్లైన్ ట్రేడింగ్, లాభదాయక ఆఫర్లు పేరుతో ప్రజలను ఆకర్షించి కోట్ల రూపాయలు దోచుకున్నట్లు గుర్తించారు.
ఈ మోసాల వెనుక ఉన్న నేరగాళ్ల నెట్వర్క్ను సమన్వయం చేయడంలో మనోజ్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా నలుగురు సైబర్ నేరగాళ్లు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
అరెస్ట్ చేసిన నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, అనుమానాస్పద లింకులు, అధిక లాభాల ఆఫర్లు, తెలియని పెట్టుబడి పథకాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Post a Comment