నేటి నుంచి మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు
మేడారం :ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియను నేటి నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. లక్షలాది మంది భక్తులు వనదేవతలైన సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో మేడారం జనసంద్రంగా మారింది.
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన సమ్మక్క–సారలమ్మ తల్లులకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఈ నేపథ్యంలో హుండీల లెక్కింపుకు హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆర్టీసీ కార్గో సేవల ద్వారా మేడారం నుంచి హనుమకొండకు మొత్తం 827 హుండీలను తరలించారు. హుండీల లెక్కింపు ప్రక్రియకు 15 రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
గత మహాజాతరలో రూ. 15 లక్షలకుపైగా హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరగడంతో ఆదాయం కూడా అధికంగా ఉండొచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.
హుండీల లెక్కింపు ప్రక్రియలో సుమారు 100 మంది సిబ్బంది పాల్గొననున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment