నేటి నుండి టోల్ ప్లాజాల వద్ద క్యాష్లెస్ పేమెంట్స్ అమలు
హైదరాబాద్: ఏప్రిల్ 01: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా, ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తూ క్యాష్లెస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ మేరకు National Highways Authority of India (ఎన్హెచ్ఏఐ) గత నెలలోనే ప్రకటన జారీ చేయగా, మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశంలోని అన్ని నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేల్లో ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
ఇప్పటి నుంచి టోల్ ఫీజులను వాహనదారులు కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లించాలి. ముఖ్యంగా FASTag లేదా UPI వంటి విధానాల ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే దేశంలోని సుమారు 98 శాతం టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ, పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపులను అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పండగల సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడి, చెల్లింపుల్లో ఆలస్యం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను తగ్గించి, వాహనదారుల ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా అధికారులు పేర్కొన్నారు.
ఈ కొత్త విధానం అమలుతో టోల్ వసూళ్లలో పారదర్శకత పెరగడంతో పాటు, వాహనాలు టోల్ గేట్ల వద్ద ఎక్కువసేపు నిలిచిపోకుండా వేగంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

Post a Comment