కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ!
భూపాలపల్లి జిల్లా: ఏప్రిల్ 20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం ను సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
తదనంతరం ఆయన మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుని, ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తో కలిసి బ్యారేజ్ను పరిశీలించారు. అక్కడ ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాలతో సీఎంను సన్మానించి, తీర్థప్రసాదం అందించారు. అలాగే శ్రీ శుభానంద (పార్వతి) అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం పర్యటనతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అనంతరం కాటారం మండలం నస్తూరిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

Post a Comment