భారీ ప్రమాదం తప్పింది – కేపీహెచ్బీలో ప్రైవేట్ బస్సు దగ్ధం
హైదరాబాద్లోని రద్దీ ప్రాంతమైన కేపీహెచ్బీలో శుక్రవారం రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు మియాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు బయలుదేరింది.
రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేపీహెచ్బీలోని పద్మావతి ప్లాజా బస్టాప్ వద్దకు చేరుకోగానే, డ్రైవర్ క్యాబిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో భయాందోళన నెలకొంది.
అయితే, అప్రమత్తమైన బస్సు సిబ్బంది వెంటనే స్పందించి ప్రయాణికులను కిందకు దించారు. బస్సులో ఉన్న సుమారు 20 మంది ప్రయాణికులు సకాలంలో బయటపడటంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సంతా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పాటు, ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది.
ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది. కాగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment