-->

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో రూ.1.22 కోట్ల హవాలా నగదు సీజ్

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో రూ.1.22 కోట్ల హవాలా నగదు సీజ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. ముంబై నుంచి సికింద్రాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.1 కోటి 22 లక్షల 70 వేల నగదును రైల్వే పోలీసులు (GRP), ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బంది సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు.

మే 26న ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలులో బొల్లారం, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ల మధ్య అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా హవాలా డబ్బు వ్యవహారం బయటపడింది.

పట్టుబడిన వ్యక్తిని మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన 40 ఏళ్ల విజయ్ అంబాదాస్ గుప్తాగా గుర్తించారు. ముంబైలో “కాంత జ్యువెలరీ” నిర్వహిస్తున్న సంతోష్ సేథ్ అనే వ్యక్తి నుంచి ఈ నగదు తీసుకున్నట్లు అతడు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఈ రూ.1.22 కోట్ల నగదును సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని “బంటి” అనే జ్యువెలరీ వ్యాపారికి అందజేయడానికి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగదు తరలింపుకు ప్రతిఫలంగా విజయ్‌కు రూ.5 వేల కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

సీజ్ చేసిన నగదుకు సంబంధించి ఎలాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793