నీట్ పేపర్ లీకేజీ కేసులో సూత్రధారి అరెస్ట్.. పుణేలో సీబీఐ అదుపులోకి!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు పుణేలో అరెస్ట్ చేశారు. రసాయన శాస్త్ర లెక్చరర్గా పనిచేస్తున్న కులకర్ణి, జాతీయ పరీక్ష సంస్థ (NTA) తరఫున ప్రశ్నాపత్రాలు రూపొందించే బృందంలో సభ్యుడిగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
సీబీఐ ప్రాథమిక విచారణలో బయటపడిన వివరాల ప్రకారం, మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని కులకర్ణి ముందుగానే లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ చివరి వారంలో మరో నిందితురాలు మనీశా వాఘ్మరే సహకారంతో తన నివాసంలో కొందరు విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించినట్లు తెలిసింది.
ఈ తరగతుల సమయంలోనే నీట్ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను విద్యార్థులకు చెప్పి, వాటికి సరైన సమాధానాలను కూడా వివరించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆ సమాధానాలను నోట్స్ రూపంలో రాసుకున్నట్లు విచారణలో తేలింది.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తున్న సీబీఐ, లీకేజీ వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను బయటకు తీయడానికి దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందిస్తోంది.

Post a Comment