ఎండాకాలం మండుతున్న చికెన్ ధరలు!
హైదరాబాద్: రాష్ట్రంలో చికెన్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి. గత వారం రోజులుగా మార్కెట్లో చికెన్ రేట్లు క్రమంగా పెరుగుతుండటంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న స్కిన్తో చికెన్ కిలో రూ.260 ఉండగా.. ప్రస్తుతం రూ.360 వరకు చేరింది. దీంతో ఒకటి, రెండు కిలోలు కొనేవారు ఇప్పుడు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు.
మటన్తో పోలిస్తే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా చికెన్ను ఇష్టపడతాయి. ధరలు అందుబాటులో ఉంటాయనే కారణంతో సాధారణంగా చికెన్కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఎండల తీవ్రత, పెళ్లిళ్ల సీజన్, మార్కెట్లో సరఫరా తగ్గుదల కలిసి చికెన్ ధరలను భారీగా పెంచేశాయి. రోజురోజుకూ చికెన్, మటన్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు కొనాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతున్నారు.
తాజా మార్కెట్ ధరల ప్రకారం:
- లైవ్ బర్డ్ (కోడి కిలో) రూ.170 – 180
- డ్రెస్సెడ్ చికెన్ రూ.320 – 330
- స్కిన్లెస్ చికెన్ రూ.350 – 360
- గుడ్లు డజన్ రూ.72 – 75 వరకు విక్రయిస్తున్నారు.
చికెన్ ధరలు భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ ధరలు జూన్ నెలాఖరు వరకు కొనసాగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
వేసవి తీవ్రత కారణంగా కోళ్ల మరణాలు పెరగడం, ఫారాల్లో ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో సరఫరా తగ్గిందని, మరోవైపు పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్ల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Post a Comment