బిఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య?
నల్లగొండ జిల్లా: మే 23: నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం యార్కారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయనపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి మూడు గోనె సంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
గ్రామంలో కొనసాగుతున్న పాత రాజకీయ విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చింతలపాటి మధు భార్య మౌనిక గతంలో బీఆర్ఎస్ తరఫున గ్రామ సర్పంచ్గా పనిచేశారు. గ్రామ రాజకీయాల్లో వారి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కొంతకాలంగా గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదే గ్రామంలో కొన్నాళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కేసుకు సంబంధించిన పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వరుస రాజకీయ హత్యలతో గ్రామంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment