వరికోత మిషన్లో చిక్కుకుని భారీ కొండచిలువ మృతి.. చూసేందుకు తరలివచ్చిన జనం
హుస్నాబాద్ పరిధిలోని అక్కన్నపేట మండలం మల్ చెరువు తండాలో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన రైతు బానోతు అనిల్ తన పొలంలో వరికోత మిషన్తో పంట కోతలు నిర్వహిస్తుండగా, పొలంలో దాక్కొని ఉన్న భారీ కొండచిలువ అకస్మాత్తుగా మిషన్ బ్లేడ్లలో చిక్కుకుంది.
మిషన్ బ్లేడ్లకు తీవ్రంగా గాయపడిన ఆ కొండచిలువ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో, కొండచిలువను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువను చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.
స్థానికుల ప్రకారం, మల్ చెరువు తండా పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో ఇక్కడ అప్పుడప్పుడు కొండచిలువలు సంచరిస్తూ కనిపించడం సాధారణమేనని తెలిపారు. అయితే వరికోత మిషన్లో చిక్కుకుని కొండచిలువ మృతి చెందడం మాత్రం అరుదైన ఘటనగా మారింది.
ఈ ఘటన ప్రస్తుతం తండాలో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment