పులి దాడిలో నలుగురు మహిళలు మృతి
Maharashtra రాష్ట్రంలోని Chandrapur district జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సిందేవాహి తాలూకా పరిధిలోని గుంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం పులి దాడిలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బీడీ ఆకుల కోసం అడవికి వెళ్లిన మహిళలపై పులి ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఈ దారుణం జరిగింది.
వేసవి కాలంలో తేందూ ఆకుల సేకరణ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అడవిలోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో గుంజేవాహి గ్రామానికి చెందిన కొందరు మహిళలు తెల్లవారుజామున అడవికి వెళ్లగా, ఉదయం సుమారు 8 గంటల సమయంలో దట్టమైన పొదల్లో మాటువేసిన పులి వారిపై మెరుపుదాడి చేసింది. పులి భీకర దాడికి మహిళలకు తప్పించుకునే అవకాశం లేకపోయింది.
ఈ ఘటనలో కవ్దూబాయ్ దాదాజీ మోహుర్లే (45), అనుబాయ్ దాదాజీ మోహుర్లే (46), సంగీతా సంతోష్ చౌదరి (36), సునితా కౌశిక్ మోహుర్లే (33) అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ, పోలీసులు అప్రమత్తమయ్యారు. సిందేవాహి ఫారెస్ట్ రేంజ్ అధికారులు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో గస్తీని పెంచడంతో పాటు పులి కదలికలపై నిఘా ఉంచారు.
అడవుల్లోకి వెళ్లే ప్రజలు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం అందించాలని అటవీ శాఖ సూచించింది.

Post a Comment