వడలో చనిపోయిన బల్లి.. కస్టమర్ ఫిర్యాదుతో హోటల్ సీజ్.. రూ.10 వేల జరిమానా
వడలో చనిపోయిన బల్లి.. కస్టమర్ ఫిర్యాదుతో హోటల్ సీజ్.. రూ.10 వేల జరిమానా
వరంగల్: వరంగల్ జిల్లా కాశీబుగ్గలో ఓ హోటల్లో విక్రయించిన వడలో చనిపోయిన బల్లి కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కస్టమర్ ఫిర్యాదు మేరకు హోటల్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు పరిశుభ్రత లోపాలను గుర్తించి హోటల్ను తాత్కాలికంగా సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.
కాశీబుగ్గ దూపం సంపత్ కూడలిలో ఉన్న ఓ హోటల్ నుంచి స్థానిక నివాసి బేతి రాజు నాలుగు వడలను పార్శిల్గా కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. అందులో రెండు వడలు తిన్న అనంతరం మూడో వడను తినబోతుండగా దాని మధ్యలో చనిపోయిన బల్లి కనిపించడంతో ఆయన ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
దీంతో వెంటనే హోటల్కు వెళ్లి జరిగిన విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమ తప్పును అంగీకరించకుండా, కస్టమర్తో హోటల్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించినట్లు బాధితుడు ఆరోపించారు. దీంతో ఆయన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ విభాగం సిబ్బంది హోటల్పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో హోటల్లో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, కిచెన్ నిర్వహణ అధ్వాన్నంగా ఉండటం, అవసరమైన లైసెన్సులు లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో హోటల్ నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించిన అధికారులు, హోటల్ను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు హెచ్చరించారు.

Post a Comment