10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన నల్గొండ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్
10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన నల్గొండ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్
నల్గొండ, జూన్ 6: నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహ్మూద్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, పెద్దవూరలోని జామే మస్జిద్ అబూబకర్ సిద్ధిఖ్ రహ్మతుల్లా అలై ఆస్తిని వక్ఫ్ బోర్డు రికార్డుల్లో నమోదు చేయాలంటూ ఫిర్యాదుదారు 2025 ఫిబ్రవరి 25న వక్ఫ్ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆ వినతిపై హైదరాబాద్లోని వక్ఫ్ బోర్డు సీఈఓకు వాస్తవ నివేదిక పంపించేందుకు అనుకూలంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ షేక్ మహ్మూద్ ఫిర్యాదుదారుని నుంచి రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని నిందితుడిని లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.10 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను నిజాయితీగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, అక్రమ ప్రయోజనం కోసం విధులను దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ పేర్కొంది.
నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్) @TelanganaACB ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment