జయశంకర్ ఆశయ సాధనే బీఆర్ఎస్ లక్ష్యం: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా జయశంకర్ను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో కేసీఆర్ మాట్లాడుతూ, బాల్యం నుంచే తెలంగాణ అస్తిత్వం కోసం సామాజిక, రాజకీయ చైతన్యంతో కృషి చేసిన నిస్వార్థ మేధావి, తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో జయశంకర్ తన ఆలోచనలకు దిక్సూచిగా నిలిచారని తెలిపారు.
సైద్ధాంతిక మార్గదర్శిగా జయశంకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గంలోనే సాధ్యమనే విశ్వాసంతో తాను చేపట్టిన కార్యాచరణకు జయశంకర్ భేషరతుగా మద్దతు ఇచ్చారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో ఆయన తనకు సైద్ధాంతిక మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు.
జయశంకర్ స్ఫూర్తితోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో సబ్బండ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని కేసీఆర్ తెలిపారు. తన పాలన జయశంకర్ ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగానే కొనసాగిందని అన్నారు.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు పిలుపు
తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని జయశంకర్ పదేపదే నినదించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ కంకణబద్ధమై ఉందని స్పష్టం చేశారు.
గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో జయశంకర్ ఆశయాలు గాడి తప్పుతున్నాయని ఆరోపించిన కేసీఆర్, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలంగాణ గరిమను, సామాజిక-రాజకీయ అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకోవడమే ప్రొఫెసర్ జయశంకర్కు అందించే నిజమైన ఘన నివాళి అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

Post a Comment