భర్త వేధింపులు తాళలేక భార్య చేతిలో భర్త హత్య.. పెద్దపల్లి జిల్లాలో విషాదం
భర్త వేధింపులు తాళలేక భార్య చేతిలో భర్త హత్య.. పెద్దపల్లి జిల్లాలో విషాదం
పెద్దపల్లి జిల్లా, జూలై 10: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ (కాశిపల్లి) గ్రామంలో కుటుంబ కలహాలు విషాదాంతానికి దారితీశాయి. భర్త వేధింపులు భరించలేక భార్య అతడిని మట్టి పెల్లలతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదంబపూర్ (కాశిపల్లి) గ్రామానికి చెందిన సయ్యద్ గోరేమియా, అతని భార్య గోరిబీ మధ్య గత ఏడాది కాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోరేమియా కొంతకాలంగా జగిత్యాలలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.
గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన గోరేమియా, భార్యతో మరోసారి గొడవకు దిగినట్లు సమాచారం. తరచూ జరుగుతున్న వేధింపులు తట్టుకోలేక ఆగ్రహానికి గురైన గోరిబీ, ఇంట్లో ఉన్న మట్టి పెల్లలతో భర్త తలపై బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన గోరేమియా అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో భార్య గోరిబీతో పాటు కుమారుడు సయ్యద్ అలీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో భర్త వేధింపుల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Post a Comment