గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ 25 వేలు జరిమాన
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ 25 వేలు జరిమాన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెంలోని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత సోమవారం తీర్పు వెలువరించారు. నిందితులిద్దరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, 2020 మార్చి 22న అప్పటి బూర్గంపాడు ఎస్ఐ బి. బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సారపాక బస్స్టాప్ సెంటర్ రోడ్డులో అనుమానాస్పదంగా వెళ్తున్న హోండా స్కూటీని తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూటీలో 20 కిలోల గంజాయి లభ్యమైంది.
నిందితులను మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన బీమనపల్లి శ్రీనివాసులు, రావీరాల లక్ష్మీనారాయణలుగా గుర్తించి వారిపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి ఏఎస్ఐ కె. సోమేశ్వరరావు కేసు నమోదు చేయగా, అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు పి. నవీన్, టి. సత్యనారాయణ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా కోర్టు ఏడుగురు సాక్షులను పరిశీలించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులపై అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించి, ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. ఫణికుమార్ వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ అధికారి డి. రాఘవయ్య, కోర్టు లైజన్ అధికారి ఎస్. వీరభద్రం, కోర్టు డ్యూటీ అధికారి పీసీ అక్రమ్ తదితరులు విచారణ ప్రక్రియలో సహకరించారు.

Post a Comment