బూడిదగడ్డ మహాంకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు
కొత్తగూడెం: పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్వీయుజ శుద్ధ ప్రతిపద నుంచి విజయదశమి వరకు 2026 అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
బూడిదగడ్డలోని శ్రీశ్రీశ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయం, శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత భాగ్యేశ్వర స్వామి పంచాయతన క్షేత్రం, శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవి క్షేత్రపాలిక అమ్మవారి ఆలయంగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా కొనసాగుతోంది.
ఆలయ చరిత్రను పరిశీలిస్తే, 1963లో పాశి కులస్తుల ఆధ్వర్యంలో మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం 1995 నుంచి శ్రీ నరేంద్ర భవాని స్వామి ఆధ్వర్యంలో ఆలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అమ్మవారి శక్తి విశేషాలతో భక్తుల పాలిట కొంగు బంగారంగా, ఆరాధ్య దైవంగా ఆలయం వెలుగొందుతోందని తెలిపారు.
ప్రతి ఏడాది నిర్వహించే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను ఈ ఏడాది కూడా భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, తమ శక్తి మేరకు ధన, ద్రవ్య, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించి ఉత్సవాల నిర్వహణకు తోడ్పడాలని శ్రీ నరేంద్ర భవాని స్వామి కోరారు. భక్తుల సహకారంతో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Post a Comment