ఖమ్మంలో 10 ప్రైవేట్ ఆసుపత్రులపై మూసివేత ఉత్తర్వులు
నకిలీ చికిత్సలతో సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం
ఖమ్మం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నిధులను దుర్వినియోగం చేస్తూ కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులు భారీ అవినీతికి పాల్పడ్డారు. రోగులకు చికిత్స చేసినట్టుగా నకిలీ కేస్షీట్లు, ఫేక్ బిల్లులు తయారు చేసి, లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని పది ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన విచారణలో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ చర్యలపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ నిధులను తమ స్వలాభం కోసం దుర్వినియోగం చేయడం భాద్యతారాహిత్యానికి నిదర్శనమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం ఈ ఆసుపత్రులను తాత్కాలికంగా మూసివేయాలని ఉత్తర్వులు జారీచేశారు.
మూసివేత ఉత్తర్వులు పొందిన ఆసుపత్రుల జాబితా:
- శ్రీ వినాయక హాస్పిటల్
- శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
- శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
- వైష్ణవి హాస్పిటల్
- సుజాత హాస్పిటల్
- ఆరెంజ్ హాస్పిటల్
- న్యూ అమృత హాస్పిటల్
- మేఘశ్రీ హాస్పిటల్
- డాక్టర్ జే. ఆర్. ప్రసాద్ హాస్పిటల్
- గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్యాధికారి డా. కళావతి భాయి మాట్లాడుతూ, “వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వుల మేరకు సంబంధిత ఆసుపత్రులపై మూసివేత చర్యలు ప్రారంభించాం. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఈ ఆసుపత్రుల సేవలు నిలిపివేయబడతాయి,” అని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వాడకంపై బాధ్యతారాహిత్యాన్ని క్షమించరాదని, దోషులపై శిక్షలు విధించాలని జనం కోరుతున్నారు.

Post a Comment