-->

ఇంస్టాగ్రామ్ ప్రేమ విషాదాంతం: 40 ఏళ్ల మహిళ, 25 ఏళ్ల యువకుడి మధ్య ప్రేమ

 

ఇంస్టాగ్రామ్ ప్రేమ విషాదాంతం: 40 ఏళ్ల మహిళ, 25 ఏళ్ల యువకుడి మధ్య ప్రేమ

 చివరకు ఇద్దరి మరణంతో ముగిసిన ఘటన

విశాఖపట్నం: సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ఒక కన్నీటి కథగా ముగిసింది. 40 ఏళ్ల మహిళ మరియు 25 ఏళ్ల యువకుడి మధ్య మొదలైన ప్రేమ చివరికి ఇద్దరి ఆత్మహత్యలతో విషాదాంతం అయింది. ఈ ఘటన విశాఖపట్నంలో సంచలనం రేపింది.

విశాఖపట్నానికి చెందిన పద్మ (40)కు భర్త, ఒక కొడుకు (మెడికల్ రిప్రజెంటేటివ్) మరియు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న కుమార్తె ఉన్నారు. పద్మకు శ్రీకాళహస్తికి చెందిన యువకుడు సురేష్ (25)తో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కుటుంబాన్ని వదిలి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్లిపోయింది.

ఇది గుర్తించిన పద్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పద్మను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కానీ అప్పటి నుంచి తమ ప్రేమలో తగ్గేదే లేదని భావించిన పద్మ, 9 నెలల క్రితం మళ్లీ వెళ్లి సురేష్‌ను వివాహం చేసుకుంది. వారు విశాఖలోని కైలాసగిరి కాలనీలో వేరు కాపురం పెట్టారు.

పెళ్లి తరువాత మొదట్లో సవ్యంగా ఉన్నా, కాలక్రమేణా వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. టిఫిన్, భోజనం వృథా చేస్తున్నదని సురేష్ పద్మపై పదేపదే అసహనం వ్యక్తం చేసేవాడు. ఈ కారణంగా పద్మ తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఒకరోజు అతని మాటలతో బాధపడి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

పద్మను ఉరేసుకున్న స్థితిలో చూసిన సురేష్ ఒక్కసారిగా భయానికి గురైపోయాడు. ఎవరినీ తెలియజేయకుండా ఇంట్లోనే నిశ్శబ్దంగా గడిపాడు. పరిస్థితి తారాస్థాయికి చేరగా, చివరికి పురుగుల మందు తాగి అతడు కూడా సూసైడ్‌కు ప్రయత్నించాడు.

ఇంటిలో నుండి వస్తున్న దుర్వాసనను గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అపస్మారక స్థితిలో ఉన్న సురేష్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతుండగానే సురేష్ మరణించాడు.

ఈ సంఘటన సమాజంలో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే సంబంధాలపై తిరిగి ఆలోచించేలా చేస్తోంది. వివాహిత మహిళతో ఓ యువకుడి ప్రేమ వ్యవహారం, వారి వివాహం, దాంతో వచ్చిన సామాజిక ఒత్తిడి, గృహ కలహాలు చివరకు రెండు ప్రాణాలను బలిగొన్న విషాదాంతంగా ముగిసింది.

Blogger ఆధారితం.