తల్లిని హత్య చేయించిన పదవ తరగతి విద్యార్థిని కేసులో నిందితుడు అరెస్ట్
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న తల్లిని హత్య చేసిన కేసులో కీలక మలుపు తిరిగింది. పదవ తరగతి చదువుతోన్న బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించిన విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బల్కంపేట డీసీపీ సురేష్ కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
ప్రేమ వ్యవహారంలో అడ్డొచ్చిందన్న కోపం.. హింసతో పెరిగిన ద్వేషం
ఇంస్టాగ్రామ్లో పరిచయమైన శివ (19) అనే యువకుడితో ప్రేమలో పడిన పదవ తరగతి విద్యార్థిని (15), తల్లి అంజలి (39) అడ్డుపడుతుండడంతో కక్ష పెంచుకుందన్నారు డీసీపీ. తల్లితో పలు సందర్బాల్లో గొడవలు జరిగి శారీరకంగా హింసకు గురైన బాలిక, తల్లి ప్రేమను అంగీకరించి తిరిగి తిరస్కరించిందన్న ఆవేదనలో హత్యకు పాల్పడిందని విచారణలో వెల్లడైంది.
మూడు ఏళ్ల క్రితమే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు
ఆ బాలిక అంజలి మొదటి భర్తకు పుట్టిన అమ్మాయిగా, రెండో భర్తకు పుట్టిన చెల్లెలిపై తల్లికి ఎక్కువ ప్రేమ చూపడం వల్ల అసూయతో బాధపడుతుండేది. ఏడవ తరగతి చదువుతుండగానే తల్లి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ బాలిక, అప్పటి నుంచి మరింత కోపంతో, బాధతో ఉండిపోయినట్టు పోలీసులు తెలిపారు.
హత్యకు ముందు కుట్ర, బెదిరింపులు
ఈనెల 18న ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు తీసుకుని శివతో వెళ్లిపోయిన బాలికను అంజలి 19న పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలికను తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. కానీ అదే రోజున బాలిక తన ప్రియుడిని ఒత్తిడి చేస్తూ తల్లిని హత్య చేయాలని చెప్పినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మొదట శివ నిరాకరించినా, బాలిక ఆత్మహత్య బెదిరింపులతో వత్తిడి చేయడంతో అతను తన 16 ఏళ్ల తమ్ముడితో కలిసి సోమవారం రాత్రి 8 గంటలకు అంజలిని గొంతు నులిమి హత్య చేశాడు.
నిందితుడు శివ అరెస్ట్ – మైనర్లు హోంలకు తరలింపు
ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన శివను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. మైనర్లు అయిన బాలిక మరియు శివ తమ్ముడిని బాల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. శివ ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూ, డీజే ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
Post a Comment