మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ సోదాలు పూర్తి
హైదరాబాద్ మాదాపూర్లోని ప్రముఖ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయంలో మంగళవారం జీఎస్టీ అధికారులు సుదీర్ఘ సోదాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సుమారు ఐదు గంటలపాటు కొనసాగాయి.
సుమారు ₹100 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న “కన్నప్ప” సినిమాకు సంబంధించిన పన్నుల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. రెండు బృందాలుగా ఏర్పడి జీఎస్టీ శాఖ అధికారులు సినిమా ఖర్చులు, పన్నుల చెల్లింపులకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. పలు కంప్యూటర్లు, ల్యాప్టాప్లను సీజ్ చేసినట్టు సమాచారం.
సోదాలు పూర్తైన అనంతరం నటుడు మోహన్ బాబు కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లారు. అయితే ఈ ఘటనపై మంచు విష్ణు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సినీ రంగంలో ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో పన్నుల ఎగవేతపై ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ వంటి చిత్రాలపై అధికారులు దృష్టి సారించడంతో ఈ తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.
Post a Comment