లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పురపాలక కార్యాలయ ఇద్దరు ఉద్యోగులు
పేద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక కార్యాలయంలో లంచం తీసుకుంటూ రెవెన్యూకార్యాలయ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు
పేద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి అధికారిక సహాయం చేస్తామంటూ ఒక ఫిర్యాదుదారుడి నుండి రూ.5,000/- లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ఈ ఘటన సుల్తానాబాద్ పురపాలక కమిషనర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనపర్తి వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్ కుమార్ అనే ఇద్దరు అధికారులు ఫిర్యాదుదారుడి నుండి లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ ఉండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని, లేదా వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్(@TelanganaACB), లేదా అధికార వెబ్సైట్ acb.telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ACB అధికారులు తెలిపారు.
అంతేకాకుండా, ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచబడుతుందని వారు హామీ ఇచ్చారు. అవినీతిపై ప్రజలు చైతన్యంగా ఉండి, నిర్భయంగా ముందుకు రావాలని ACB సూచించింది.
Post a Comment