రోశయ్య జయంతి అధికారికంగా నిర్వహణ – సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
హైదరాబాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య 92వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో ఈ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం లక్డీకాపూల్ చౌరస్తాలోని పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద, మైట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన 450 కిలోల రోశయ్య విగ్రహాన్ని సీఎం స్వయంగా ఆవిష్కరించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నేతృత్వంలో అధికారులు పర్యవేక్షించారు.
మాజీ సీఎం రోశయ్య సేవలను గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, "16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే చెందింది. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో వివాదాల నుంచి దూరంగా ఉండి, ఆదర్శ నాయకుడిగా గుర్తింపు పొందారు" అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన తమిళనాడు గవర్నర్గా కూడా విశేష సేవలు అందించారన్న సీఎం, ఆయన వ్యక్తిత్వం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రోశయ్య స్మారక వేదిక సభ్యులు కామిశెట్టి అనిల్ కుమార్, ఫెడరేషన్ ఆఫ్ అవొపాస్ జాతీయ అధ్యక్షుడు సీఏ బెల్ది మాట్లాడుతూ – "అతి తక్కువ సమయంలో విగ్రహం రూపుదిద్దుకోవడం, అదే వేగంగా ఆవిష్కరణ జరగడం – సీఎం చొరవ వల్లే సాధ్యమైంది. వైశ్య సంఘం తరఫున ఈ గౌరవం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాతతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు..

Post a Comment