ప్రేమ పేరుతో యువకుడి బెదిరింపులు.. తాళలేక వివాహిత ఆత్మహత్య
ముల్కనూరు (మహబూబాబాద్ జిల్లా), భర్త శారీరక, మానసిక వేధింపులు ఒకవైపు.. ప్రేమ పేరుతో యువకుడి తరచూ ఫోన్లు మరోవైపు.. ఈ రెండు ఒత్తిడులు తాళలేక ఓ యువ వివాహిత విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన దుర్దైన సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన **శైలజ(24)**కి 8 సంవత్సరాల క్రితం ముల్కనూరు గ్రామానికి చెందిన ఏదుల సతీశ్కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లి తర్వాత మొదటి ఐదేళ్లు కాపురం సజావుగా సాగినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారాయి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో, గత మూడు సంవత్సరాలుగా పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్, శైలజను ప్రేమ పేరుతో వేధించటం ప్రారంభించాడు. “నిన్ను ప్రేమిస్తున్నాను.. భర్త, పిల్లలను వదిలిపెట్టి నా వద్దకు రా” అంటూ ఆమెను తరచూ ఫోన్ చేసి మనస్తాపానికి గురిచేసేవాడు.
ఈ విషయం రెండు సంవత్సరాల క్రితం భర్త సతీశ్కు తెలిసింది. అప్పటి నుంచి శైలజపై అతని అనుమానాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆమెను తరచూ ప్రశ్నిస్తూ, వివాహేతర సంబంధం విషయంలో నిందిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. “నువ్వు ఎందుకు బతుకుతున్నావు? చావలే” అంటూ తిడుతూ మానసిక ఒత్తిడికి గురిచేసినట్టు సమాచారం.
ఈ వేధింపులు తాళలేక శైలజ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన భర్త ఆమెను మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ శైలజ మృతిచెందింది.
ఈ ఘటనపై బాధితురాలి తల్లి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఏదుల సతీశ్కుమార్, యువకుడు కంపటి శ్రీరామ్ లపై కేసు నమోదు చేసినట్టు గార్ల ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment