ఫోన్ తరచూ మాట్లాడుతుందని భార్యను హత్య చేసిన భర్త
నాగర్కర్నూల్ : ఫోన్లో తరచూ మాట్లాడుతుందని అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో వెలుగుచూసింది.
రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకు, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్కు చెందిన శ్రావణి (27) రాంగ్ నెంబర్ ద్వారా పరిచయం అయ్యింది. ఫోన్లో మాటలు పెరిగి ప్రేమలో పడి 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దంపతులకు ఒక బాబు, ఒక పాప పుట్టారు.
అయితే పెళ్లి తర్వాత కొంతకాలానికే శ్రావణి పిల్లలను వదిలేసి తన అక్క భర్తతో వెళ్లిపోయింది. ఏడాది క్రితం తిరిగి ఇంటికి వచ్చి భర్తతో జీవనం ప్రారంభించింది. ఈ క్రమంలో శ్రావణి తరచూ ఫోన్లో మాట్లాడుతూ, ఇతరులతో చాటింగ్ చేయడం గమనించిన శ్రీశైలం అనుమానం పెంచుకున్నాడు.
ఆమెకు పలుమార్లు హెచ్చరికలు చేసినా మారకపోవడంతో, హత్యకు పథకం వేసి అమలు చేశాడు. భార్యను కత్తితో పొడిచి హత్య చేసి, అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. హత్యకు కారణాలు, పూర్తి వివరాలు వెలికితీసేందుకు దర్యాప్తు చేపట్టారు.
Post a Comment