మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
హైదరాబాద్, అక్టోబర్ 13:చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (85) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఉదయం 5:30 గంటలకు హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
1980లో జర్నలిజం పట్ల ఉన్న మక్కువతో ఆయన NSS వార్తా సంస్థను స్థాపించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేసిన ఆయన, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా సేవలందించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన లక్ష్మారెడ్డి గారి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో బలంగా ముడిపడి ఉంది. ఆయన ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి ఛైర్మన్గా కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
జర్నలిజం, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన కొండా లక్ష్మారెడ్డి మరణం పట్ల పత్రికా వర్గాలు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment