పాల్వంచ–కిన్నెరసాని రహదారి దుస్థితి: కరకవాగు వద్ద గోతులు, నిల్వ నీరు – ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి కిన్నెరసాని వైపు వెళ్లే ప్రధాన రహదారి గత కొంతకాలంగా ప్రమాదకరంగా మారింది. కరకవాగు ప్రాంతంలో రోడ్డంతా గుంటలు, నీటి నిల్వలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.
వర్షాలు + లీకేజీలు = రహదారి పూర్తిగా దెబ్బ
తీవ్రమైన వర్షాలతో పాటు, ఏడాది కాలంగా కొనసాగుతున్న పైపులైన్ లీకేజీ కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఎక్కడ చూసిన గోతులే కనిపిస్తున్నాయి. నిల్వ నీరు ఎండలేని కారణంగా వాహనదారులు ఏ గుంత ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి నెలకొంది.
రోజువారీ ప్రయాణికులకు పెరుగుతున్న ఇబ్బందులు
ఈ రహదారిపై ప్రతిరోజూ ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కేటీపీఎస్ ఉద్యోగులు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, పాదచారులు, పర్యాటకులు ఈ మార్గం పూర్తిగా ప్రమాదకరంగా మారిపోతోందని స్థానికులు అంటున్నారు. కొద్ది క్షణాల నిర్లక్ష్యంతోనే వాహనాలు కుప్పకూలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కిన్నెరసాని వెళ్లే పర్యాటకులకు కూడా ఇబ్బందులే
కిన్నెరసాని జలాశయం, వన్యప్రాణి అభయారణ్యం ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లే సందర్శకులు ఈ మార్గం ద్వారానే ప్రయాణించాల్సి రావడం వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో నిండిన రహదారిపై ప్రయాణం మరణ మృత్యువుతో సరిసమానంగా ఉందని వారు చెబుతున్నారు.
రహదారి వెంటనే మరమ్మతు చేయాలని ప్రజల డిమాండ్
స్థానిక ప్రజలు, వాహనదారులు కలిసి వెంటనే చర్యలు తీసుకొని రహదారిని మరమ్మతు చేయాలని అధికారులను కోరుతున్నారు. రోడ్డు మరమ్మతు జరిగే వరకు ప్రమాదాలు నివారించేందుకు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment