అప్పులు ఇప్పించిన పాపానికి నిండు సంసారం బలి దంపతుల ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో దంపతుల ఆత్మహత్య
సిద్దిపేట/బెజ్జంకి, డిసెంబర్: స్నేహితులని నమ్మి మధ్యవర్తిగా అప్పులు ఇప్పించడం ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. అప్పు తీసుకున్న వారు ముఖం చాటేయడం, డబ్బు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది.
దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), ఆయన భార్య రుక్మిణి (25) దంపతులు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. శ్రీహర్ష తనకు పరిచయమైన స్నేహితులు, తెలిసిన వ్యక్తులకు మధ్యవర్తిగా ఉండి సుమారు రూ.13 లక్షల వరకు అప్పులు ఇప్పించారు.
అయితే అప్పు తీసుకున్న వారు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో అసలు సమస్య మొదలైంది. డబ్బు ఇచ్చిన వారు శ్రీహర్షపై తీవ్ర ఒత్తిడి పెంచడం, వేధింపులకు గురిచేయడంతో దంపతులు తీవ్రమైన మనస్తాపానికి లోనయ్యారు. చివరకు దిక్కుతోచని స్థితిలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
చిన్నారి కేకలతో వెలుగులోకి వచ్చిన ఘటన
ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే దంపతులు పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూసి మూడేళ్ల చిన్నారి హరిప్రియ గట్టిగా కేకలు వేయడంతో ఇంటి యజమాని అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీహర్షను ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచాడు.
చిన్నారికి కూడా విషం ఇచ్చారేమోనన్న అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె పూర్తిగా క్షేమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సూసైడ్ నోట్లో ఐదుగురి పేర్లు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రవీందర్రెడ్డి శ్రీహర్ష రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి కారణమైన ఐదుగురి పేర్లను సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుల వేధింపులే ఈ విషాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఒకే చితిపై అంత్యక్రియలు
పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన దాచారంలో శ్రీహర్ష–రుక్మిణి దంపతుల మృతదేహాలకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి హరిప్రియ పరిస్థితి చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు.

Post a Comment