ఘోర రోడ్డు ప్రమాదం ఆటో–బుల్లెట్ ఢీ… ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి ఫంక్షన్ హాల్ సమీపంలో ఆటోకు బుల్లెట్ వాహనం ఢీకొనడంతో సాయి ప్రసాద్ సహా మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల కథనం ప్రకారం, ఆర్మూర్ వైపు నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన బుల్లెట్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఢీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో పూర్తిగా దెబ్బతిని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సాయి ప్రసాద్తో పాటు మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా, సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన బుల్లెట్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించగా, వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇటీవలి కాలంలో ఆర్మూర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాహనదారులు వేగ నియంత్రణ పాటించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Post a Comment