-->

పండుగ వేళ విషాదం.. ఊరంతా కాలి బూడిదైంది..!

పండుగ వేళ విషాదం.. ఊరంతా కాలి బూడిదైంది..!


సంక్రాంతి పండుగ వేళ పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే… కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లె మాత్రం కన్నీళ్లలో మునిగిపోయింది. పండుగ సంబరాలతో కళకళలాడాల్సిన ఆ గ్రామం ఒక్కసారిగా బూడిద కుప్పగా మారింది. సోమవారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 40 కుటుంబాలు తమ ఇళ్లు, ఆస్తులను కోల్పోయి రోడ్డున పడ్డాయి.

సంక్రాంతి ఏర్పాట్ల కోసం గ్రామస్థులంతా తుని పట్టణానికి వెళ్లారు. పండుగ సరుకులు, నిత్యావసరాలు కొనుగోలు చేసి తిరిగి వచ్చేలోపే విధి వక్రీకరించింది. గ్రామంలోని ఒక ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గాలివాటం ఎక్కువగా ఉండటం, ఇళ్ల మధ్య దూరం తక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే పక్కపక్కనున్న ఇళ్లకు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న వెంటనే తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది బయలుదేరినా… గ్రామానికి చేరుకునేలోపే సుమారు 50 కిలోమీటర్ల దూరం కారణంగా విలువైన సమయం వృథా అయ్యింది. అప్పటికే ఇళ్లన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఇళ్లలో ఉన్న బట్టలు, ధాన్యం, నగదు, ముఖ్యమైన పత్రాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. కొందరు పండుగ కోసం దాచుకున్న బంగారం కూడా బూడిదైంది.

ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు తలదాచుకునే చోటు లేక అవేదన వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ రోజే ఈ విషాదం చోటుచేసుకోవడంతో గ్రామమంతా దిగ్భ్రాంతికి గురైంది. బాధితులను వెంటనే ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన అధికారులు నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793