తినే టిఫిన్ చట్నీలో బల్లి ప్రత్యక్షం.. జగిత్యాలలో కలకలం
జగిత్యాల: పట్టణంలోని శివసాయి టిఫిన్ సెంటర్లో కలకలం రేగింది. టిఫిన్ చేస్తుండగా చట్నీలో బల్లి బయటపడటంతో కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దోస తినే సమయంలో చట్నీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా హోటల్లో కలకలం చోటుచేసుకుంది.
బుగ్గారం గ్రామానికి చెందిన ఓ మహిళ శివసాయి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చట్నీతో పాటు బల్లి కనిపించడంతో ఆమెకు ఒక్కసారిగా వాంతులు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే అక్కడున్న వారు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై హోటల్ యాజమాన్యంతో బాధితులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారని, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానికులు కూడా హోటల్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా ఇదే శివసాయి టిఫిన్ సెంటర్లో టిఫిన్లో బొద్దింకలు బయటపడ్డ ఘటనలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. పునరావృతంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో హోటల్ నిర్వహణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా టిఫిన్లో బల్లి బయటపడిన ఘటనతో జగిత్యాల పట్టణంలో మరోసారి ఆహార భద్రతపై చర్చ మొదలైంది. సంబంధిత అధికారులు స్పందించి హోటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment