జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 01: జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, జర్నలిస్టులకు సంబంధించి తన పరిధిలో ఉన్న సమస్యలను దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
గురువారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా యూనియన్ రూపొందించిన 2026 మీడియా డైరీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
అదేవిధంగా జర్నలిస్టులకు నూతన సంవత్సర కానుకగా ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన సీఎం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శులు వి. యాదగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం. వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, అజిత, చిన్న తదితరులు పాల్గొన్నారు.
అలాగే మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియుద్దీన్, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరీష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు
అనంతరం యూనియన్ ప్రతినిధి బృందం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది.
సీఎం, మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన మీడియా అకాడమీ చైర్మన్
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి కూడా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment