-->

తాగి స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిన వ్యక్తిని పీక్కుతిన్న కుక్కలు

తాగి స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిన వ్యక్తిని పీక్కుతిన్న కుక్కలు


రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని మధురానగర్‌ కాలనీలో శనివారం ఉదయం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయిన ఓ వ్యక్తిని కుక్కలు పీక్కుతిన్న దారుణ సంఘటన స్థానికులను కలచివేసింది.

తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అక్కలాయక్కన్‌పట్టి గ్రామానికి చెందిన చిన్నారసు (36) ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్యోగం కోసం వచ్చాడు. అక్కడ మరికొందరితో కలిసి ఓ గదిలో నివాసముంటూ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతిగా మద్యం సేవించిన చిన్నారసు మధురానగర్‌ కాలనీలోని సంతోషిమాత ఆలయం వీధి మూలమలుపు వద్ద స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయాడు.

రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో రోడ్డుపై పడి ఉన్న చిన్నారసును గమనించిన కొందరు స్థానికులు అతడిని పక్కకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో పారిశుద్ధ్య సిబ్బంది అతడిని శవమై కనిపెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తొలుత ఇది హత్యగా భావించినప్పటికీ, చిన్నారసు గొంతు భాగం తీవ్రంగా కొరికినట్టుగా ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గొంతు భాగంలో మాంసం అధికంగా కోల్పోయి ఉండటంతో కుక్కలు పీక్కుతిన్నట్లు పోలీసులు అనుమానించారు.

ఈ క్రమంలో సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, మధ్యరాత్రి సమయంలో స్పృహలేకుండా పడి ఉన్న చిన్నారసును కుక్కలు చుట్టుముట్టిన దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే వైద్యుల ప్రాథమిక పరిశీలనలో కుక్కలకన్నా ముందే పందికొక్కులు లేదా పందులు గొంతు భాగాన్ని కొరికివుండవచ్చని, అనంతరం కుక్కలు మృతదేహాన్ని పీక్కుతిన్న అవకాశం ఉందని తెలుస్తోంది.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వీధి కుక్కలు, పందుల నియంత్రణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793