సంక్రాంతి ప్రయాణం విషాదంగా ముగిసింది.. తల్లి, మూడేళ్ల పాప మృతి
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. సంక్రాంతి పండుగను స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని బయలుదేరిన కుటుంబానికి మృత్యువు రూపంలో ప్రమాదం ఎదురైంది. కళ్లముందే భార్య మృతి చెందగా, మూడేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఏపీ నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రి గ్రామానికి చెందిన సూర్య తిరుపతయ్య తన భార్య నాగమణి (25), చిన్న కూతురు యస్న (3), మరో కూతురు ప్రియాంచితో కలిసి హైదరాబాద్ అల్వాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లేందుకు మంగళవారం ఉదయం బైక్పై హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
మార్గమధ్యంలో మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని గాజులపేట స్టేజీ జాతీయ రహదారిపై మోటార్సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రేలింగ్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగమణి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన మూడేళ్ల యస్నను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
తిరుపతయ్యతో పాటు మరో కూతురు ప్రియాంచి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగమణి తల్లి ఉస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
రెండు రోజుల్లో రెండో ప్రమాదం
భూత్పూర్ జాతీయ రహదారిపై ఇదే ప్రాంతంలో రెండు రోజుల క్రితం మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఏపీకి చెందిన భార్యాభర్తలు మృతిచెందారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతిలోని కూతురు వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండుగ వేళ వరుస ప్రమాదాలు జరగడం వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Post a Comment