సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భారీ ఏర్పాట్లు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026ను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి తరలిరానున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ఈ ఏర్పాట్లన్నిటిపై ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రతి విభాగం పనితీరును సమీక్షిస్తూ అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారు. భక్తుల సౌకర్యం, సురక్షితమైన దర్శనం ఆమె ప్రధాన ప్రాధాన్యంగా మారింది.
ఈసారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు జాతరకు హాజరవుతారనే అంచనాతో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టింది. జాతర నిర్వహణ కోసం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనుండగా, అదనంగా 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు.
కమ్యూనికేషన్, భద్రతా ఏర్పాట్లు
మొబైల్ నెట్వర్క్కు అంతరాయం కలగకుండా 27 శాశ్వత టవర్లు, 33 తాత్కాలిక టవర్లు, 450 VHF సెట్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లు, 42 సెక్టర్లుగా విభజించారు. ఒక్కో జోన్కు జిల్లా స్థాయి అధికారి, ఒక్కో సెక్టార్కు మండల స్థాయి అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు.
ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, నర్లాపూర్, పడిగాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూములు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
రవాణా – పార్కింగ్ సౌకర్యాలు
భక్తులు సులభంగా మేడారానికి చేరుకునేలా టీజీఎస్ఆర్టీసీ ద్వారా 4,000 బస్సులు, 51,000 ట్రిప్పులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బస్టాండ్లు, ప్రత్యేక రూట్లతో రవాణా వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవల కోసం 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
తాగునీరు – పారిశుధ్యం
మిషన్ భగీరథ ద్వారా నిరంతర తాగునీటి సరఫరా కోసం 5,482 తాగునీటి నల్లాలు ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాల కోసం 119 డ్రెస్సింగ్ రూములు సిద్ధం చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం క్లోరినేషన్ చేపడుతున్నారు.
పారిశుధ్య నిర్వహణ కోసం 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లు, అదనంగా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 5,000 మంది పారిశుధ్య సిబ్బంది, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మెషిన్లు, 12 JCBలు, 40 స్వచ్చ ఆటోలు, 16 డోజర్లు రంగంలోకి దిగాయి.
విద్యుత్ – వైద్య సేవలు
విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా 196 ట్రాన్స్ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కి.మీ లైన్లు ఏర్పాటు చేసి, 350 మంది సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్ జనరేటర్లు సిద్ధంగా ఉన్నాయి.
అటవీ శాఖ, ఐటిడీఏ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజనులకు వ్యాపార లైసెన్సులు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
మొత్తంగా సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026ను భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభూతిగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకెళ్తోంది.

Post a Comment