చైనా మంజాతో యువకుడి మెడకు తీవ్ర గాయం
రాయికోడ్: గొంతులు కోసి ప్రాణాలు తీస్తున్న చైనా మంజాను నిషేధించినప్పటికీ, అక్రమంగా విక్రయిస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని ధర్మపూర్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి బేగరి సాయి కుమార్ (17) శుక్రవారం తన స్వగ్రామం నుంచి రాయికోడ్ మండల కేంద్రానికి బైక్పై వెళ్తుండగా చైనా మంజా అతని మెడకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడికి భారీగా రక్తస్రావం జరిగింది.
అతని వెనుకే ప్రయాణిస్తున్న అక్క స్రవంతి, చెల్లెలు సంధ్యారాణి వెంటనే స్పందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జహీరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెడకు నాలుగు కుట్లు వేశారు.
తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన సాయి కుమార్ను చూసి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. చైనా మంజా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment