నేడు ఆటోలు బంద్ డ్రైవర్లతో ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ
హైదరాబాద్: ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. నాచారంలోని ఆటో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు ఆటో డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ వాహన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో బంద్ను విజయవంతం చేస్తామని టీఏడీఎస్ నాయకుడు సత్తిరెడ్డి పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం ఎప్పటి నుంచి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సారథి’ పోర్టల్ను రద్దు చేయాలని కూడా వారు కోరారు.

Post a Comment