సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. భార్యాభర్తలు గల్లంతు
నల్లగొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన విషాద ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు గల్లంతయ్యారు.
త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య, ఆయన భార్య పద్మ శనివారం ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి గ్రామానికి వస్తుండగా, ముకుందాపురం వద్ద కంపాసాగర్కు వెళ్లే మార్గంలో ఉన్న సాగర్ ఎడమ కాల్వ వద్ద ప్రమాదం జరిగింది.
అనూహ్యంగా కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న డ్రైవర్ అద్దాలు పగులగొట్టుకుని బయటపడగలిగాడు. అయితే పుల్లయ్య, పద్మ దంపతులు కారులోనే చిక్కుకుపోయి గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదమేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. గల్లంతైన దంపతుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Post a Comment