-->

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే చేరి సత్వర న్యాయం

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే చేరి సత్వర న్యాయం – మహబూబాబాద్ పోలీసులు


మహబూబాబాద్ జిల్లా పోలీసులు ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులను నమోదు చేయడం ఈ విధానానికి ప్రధాన ప్రత్యేకత.

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 35 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే ప్రధాన కేసులు:

  • మహిళలు మరియు చిన్నారులపై నేరాలు
  • లైంగిక నేరాలు (POCSO, అత్యాచారం మొదలైనవి)
  • ఎస్సీ / ఎస్టీ అఘాయిత్యాలు
  • ఆస్తి సంబంధిత నేరాలు (చోరీ, దోపిడీ)
  • వృద్ధులపై నేరాలు
  • ప్రత్యేక చట్టాల కింద కేసులు (డౌరీ, బాల్య వివాహం, ర్యాగింగ్ మొదలైనవి)
  • స్టేషన్‌కు రాలేని బాధితుల ఇతర ఫిర్యాదులు

ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా మారింది. బాధితుని వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోంది.

“బాధితులకు సత్వర న్యాయం అందించడమే మా లక్ష్యం. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్ ద్వారా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము,” అని ఎస్పీ డా. శబరీష్ పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793