నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన నారాయణఖేడ్ డివిజన్ ఉద్యోగులు
ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం TGEJAC పిలుపు మేరకు, TGEJAC ఛైర్మన్ మహమ్మద్ జావీద్ అలీ ఆదేశాలపై నారాయణఖేడ్ డివిజన్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ నిరసనలో భాగంగా సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు సమీకరించారు. ఈ కార్యక్రమంలో TNGO నారాయణఖేడ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ మిస్కిన్, పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. రాజు, జిల్లా జాయింట్ కార్యదర్శి బాలు, జిల్లా ఈసీ సభ్యుడు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ (PRC) అమలు చేయాలని, పెండింగ్ డీఏలు మరియు బిల్లులను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు CPS ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను కూడా త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిర్గాపూర్ మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment