రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన అటవీ శాఖ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మే 07: భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (ఎఫ్డీవో) సుజాత, చర్ల ఇన్చార్జ్ డీఆర్వో కృష్ణయ్యలు ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. బాధితుడి నుంచి రూ.3.5 లక్షల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దాడుల్లో ఈ అవినీతి వ్యవహారం బయటపడింది.
తెలిసిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని చెట్లను తొలగించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం ఎఫ్డీవో సుజాత బాధితుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో గురువారం ఉదయం మొదటి విడతగా రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి సుజాతతో పాటు చర్ల అటవీ శాఖ ఇన్చార్జ్ అధికారి కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన అధికారులను విచారిస్తున్నామని, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Post a Comment