35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ లైన్మన్
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ లైన్మన్ పప్పుల రమేష్ను లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి వ్యవసాయ భూమిలో ఉన్న బోర్వెల్లకు విద్యుత్ సరఫరా కల్పించేందుకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ అమర్చే అధికారిక పనికి సహకారం అందించేందుకు రూ.35 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం ఫిర్యాదుదారుడి నుంచి ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా నల్గొండ రేంజ్ ఏసీబీ బృందం పట్టుకుంది.
నిందితుడి వద్ద నుంచి రూ.35 వేల లంచం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినందుకు అతడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.
ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

Post a Comment