-->

పుట్టిన శిశువును మృతి చెందిందని చెప్పి లక్ష యాబై వేలకు విక్రయం

మెదక్‌లో సంచలనం: పుట్టిన శిశువును మృతి చెందిందని చెప్పి లక్ష యాబై వేలకు విక్రయం


మెదక్, మే 6: జిల్లా కేంద్రం మెదక్‌లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు పుట్టిన ఆడశిశువును మృతి చెందిందని మోసం చేసి, తరువాత విక్రయించిన దారుణం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె 7 నెలల గర్భిణిగా ఉండగా గత నెల 12న మెదక్‌కు వచ్చింది. ఈ సమయంలో కోతుల దాడికి గురై కిందపడటంతో తీవ్ర రక్తస్రావం కావడంతో, స్నేహితురాలు పర్వీన్‌బేగం సహాయంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది.

మరుసటి రోజు వైద్యులు శస్త్రచికిత్స చేసి 2.4 కిలోల బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చారు. అయితే, అక్కడ పనిచేస్తున్న నర్సు అక్తరీ బేగం శిశువు మృతి చెందిందని నస్రా ఫాతిమాను నమ్మించింది. మూడు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.

కొన్ని రోజుల తర్వాత ఓ గుర్తుతెలియని వ్యక్తి పాప బతికే ఉందని చెప్పడంతో అనుమానం వ్యక్తమైంది. స్నేహితురాలు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆసుపత్రిని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో భర్త అస్లాం ఖాన్‌తో కలిసి ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నర్సు అక్తరీ బేగం పసికందును మెదక్‌కు చెందిన నౌసిన్ ఉన్నిసాకు అప్పగించగా, ఆమె సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాలుద్దీన్, సదీయ సుల్తానా దంపతులకు రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అందులో రూ.1.40 లక్షలు నర్సు తీసుకుని, రూ.10 వేలు మధ్యవర్తికి ఇచ్చినట్లు తెలిపారు.

పోలీసులు సిద్దిపేట నుంచి శిశువును సురక్షితంగా తీసుకువచ్చి, మెదక్ సఖి కేంద్రంలో అప్పగించారు. ఈ కేసులో నర్సు, మధ్యవర్తి, శిశువును కొనుగోలు చేసిన దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసుపత్రి యజమాని పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ విచారణకు ఆదేశించగా, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆసుపత్రిని మూసివేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793