శంషాబాద్లో బొలెరో బీభత్సం.. బస్ స్టాప్ వద్ద ఇద్దరు మహిళలు దుర్మరణం
రంగారెడ్డి జిల్లా, జూలై 9: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సత్తంరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి ఉన్న మహిళలపైకి మిర్చి లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను సుమ మరియు సువర్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. బొలెరో వాహనం వేగంగా రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్ స్టాప్ వద్ద ఉన్న మహిళలపైకి దూసుకెళ్లినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణ కోసం సత్తంరాయి బస్ స్టాప్ సమీపంలో జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను స్థానికులు డిమాండ్ చేశారు.

Post a Comment