సింగరేణిలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఆందోళన
మెడికల్ బోర్డు నిర్ణయానికి నిరసనగా సింగరేణిలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఆందోళన
మణుగూరు, జూలై 21: సింగరేణి సంస్థలో మెడికల్ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా హెచ్ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మణుగూరు ఏరియాలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షలకు మొత్తం 120 మంది ఉద్యోగులను పిలిచినప్పటికీ కేవలం 24 మందినే "ఆన్ ఫిట్"గా ప్రకటించడం అన్యాయమని ఆరోపించారు. మిగిలిన ఉద్యోగుల పట్ల మెడికల్ బోర్డు అనుసరించిన విధానం పారదర్శకంగా లేదని, దీనివల్ల అనేక మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా మెడికల్ బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించి, 100 శాతం మంది ఉద్యోగులను "ఆన్ ఫిట్"గా ప్రకటించాలని హెచ్ఎంఎస్ యూనియన్ డిమాండ్ చేసింది. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో హెచ్ఎంఎస్ మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత, బ్రాంచ్ సెక్రటరీ దరిసా రమేష్తో పాటు యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment