ఆగస్టు 16లోపు ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ తప్పనిసరి.. వినియోగదారులకు చమురు సంస్థల సూచన
ఆగస్టు 16లోపు ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ తప్పనిసరి.. వినియోగదారులకు చమురు సంస్థల సూచన
హైదరాబాద్, ఆగస్టు 3: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి కుటుంబం ఆగస్టు 16 లోపు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు సూచించాయి. ఈ మేరకు కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు భారీగా తరలివెళ్తున్నారు.
గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీని తగ్గించేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే ఈ-కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, పలువురు వినియోగదారులు పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనెక్షన్దారు విదేశాల్లో ఉండటం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం, ఆధార్ వివరాలు గ్యాస్ కనెక్షన్ వివరాలతో సరిపోలకపోవడం, ఒకే కుటుంబంలో రెండు కనెక్షన్లు ఉండటం వంటి కారణాలతో ఈ-కేవైసీ పూర్తికాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇటీవలి అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరగడంతో బుకింగ్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీలో ఆలస్యం చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న గ్యాస్ను నిజమైన గృహ వినియోగదారులకు మాత్రమే అందించేందుకు, బోగస్, డూప్లికేట్, దీర్ఘకాలంగా వినియోగంలో లేని కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు చమురు సంస్థలు ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేశాయి.
వినియోగదారుల ఆధార్, బయోమెట్రిక్ వివరాలను గ్యాస్ కనెక్షన్తో అనుసంధానం చేయడం ద్వారా అసలు లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా సేవలు అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
వినియోగదారులకు సూచనలు:
ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి.
అవసరమైన ఆధార్, గ్యాస్ కనెక్షన్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
సమస్యలు ఎదురైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీని వెంటనే సంప్రదించాలి.
డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే ఈ-కేవైసీ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు.

Post a Comment