సిమెంట్ ఇప్పిస్తానని చెప్పి వివాహితపై అత్యాచారం.. పార్టీ నాయకుడిపై కేసు
యాదాద్రి భువనగిరి జిల్లా: ఇల్లుకు సిమెంట్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వివాహితను ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇల్లు మంజూరైంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు శంకర్రెడ్డి.. ఇంటి నిర్మాణానికి సిమెంట్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను తన ఇంటికి పిలిపించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయంపై కేసు పెడతానని బాధితురాలు చెప్పడంతో.. అరెకరం భూమి రాసిస్తానని, అన్ని విధాలుగా ఆదుకుంటానని శంకర్రెడ్డి నమ్మించినట్లు తెలిపింది. ఆ తర్వాత కూడా పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.
కాగా, ఈ విషయం బాధితురాలి భర్తకు తెలియడంతో గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినట్లు సమాచారం. అనంతరం బాధితురాలిని, ఆమె భర్తను శంకర్రెడ్డి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment