పెళ్లికి ముందే విషాదం.. వీడియో కాల్లో ప్రాణాలు తీసుకున్న యువజంట
పెళ్లికి ముందే విషాదం.. వీడియో కాల్లో ప్రాణాలు తీసుకున్న యువజంట
మూడుముళ్ల బంధంతో జీవితాంతం కలిసి సంతోషంగా గడపాల్సిన యువజంట పెళ్లికి ముందే బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివాహ నిశ్చయం చేసుకున్న యువతి హుణసూరులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఘటనను వీడియో కాల్లో చూసిన కాబోయే భర్త కేరళలోని ఎర్నాకుళంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కాసరగోడ్ జిల్లా హోసదుర్గ తాలూకా పల్లకెరెకు చెందిన చందన్ పెద్ద కుమార్తె అనుశ్రీ (26) హుణసూరులోని స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కేరళలోని కన్నూర్ జిల్లా ఎరట్టి తాలూకా మదతి గ్రామానికి చెందిన సుధాకర్ కుమారుడు అమల్ (30) కూడా ఉద్యోగం చేస్తున్నాడు.
అనుశ్రీ, అమల్కు పెద్దలు ఇటీవల నిశ్చితార్థం చేశారు. డిసెంబరు 26న వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్లి ఖరారైనప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు.
అయితే శుక్రవారం రాత్రి మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అనుశ్రీ అమల్కు వీడియో కాల్ చేసి, తాను ఉంటున్న గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనను వీడియో కాల్లో చూసిన అమల్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అనంతరం ఎర్నాకుళంలోని ఓ లాడ్జికి వెళ్లి అక్కడ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మరోవైపు కుమార్తె ఆత్మహత్య విషయం తెలుసుకున్న తండ్రి చందన్ హుణసూరుకు చేరుకుని అనుశ్రీ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తన కుమార్తెను అమల్ ఫోన్లో వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుశ్రీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి కొద్దిరోజుల ముందే యువజంట మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Post a Comment