జంతువుల ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్
జంతువుల ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బలయ్యారు. నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
చెరువు సింగారం వెస్ట్ బీట్కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీఓ) నవీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో విద్యుత్ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. విద్యుత్ షాక్కు గురైన ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 అంబులెన్స్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. విధుల్లో ఉన్న ఫారెస్ట్ అధికారే వేటగాళ్లు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న విద్యుత్ ఉచ్చుకు బలికావడం ఆందోళన కలిగిస్తోంది.
అసలు విద్యుత్ ఉచ్చును ఎవరు ఏర్పాటు చేశారు? అడవి జంతువుల వేట కోసమే దాన్ని అమర్చారా? నవీన్ ఏ ప్రాంతంలో, ఏ పరిస్థితుల్లో ఉచ్చుకు చిక్కుకున్నారు? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment